2011 నుండి 2017లో తాను పరమపదించే వరకు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. నాల్గవ అధ్యక్షురాలిగా సేవలందించిన శ్రీ మృణాళినీమాతగారి, “యోగ సాధన ద్వారా దైవప్రమ మరియు ఆనందం పొందడం” అనే ప్రసంగం నుండి ఈ సంక్షిప్త భాగం సంగ్రహించబడింది. పూర్తి ప్రసంగం యొక్క ఆడియో వై.ఎస్.ఎస్. బ్లాగ్ లో మరియు ఈ పేజీ దిగువన లభ్యమవుతుంది. ఈ ఉపన్యాసము యొక్క పూర్తి ముద్రిత సంస్కరణను మా యోగదా సత్సంగ పత్రిక పేజీలోని నమూనా కథనాలలో ఒకటిగా చదవవచ్చు.
భారతదేశపు ప్రాచీన యోగ బోధనలను ఆధునిక ప్రపంచానికి తీసుకురావడానికి ఉపకరించిన పరమహంస యోగానందగారి జీవితం మరియు గొప్ప ఇతిహాసాన్ని గురించి మా వెబ్సైట్లో మీరు మరింతగా తెలుసుకోవచ్చు.
పశ్చిమంలో తన కార్యాన్ని నెరవేర్చడానికి తన స్వదేశాన్ని పరమహంస యోగానందగారు విడిచిపెట్టినప్పుడు, ఆయన హృదయం మరియు ఆత్మ మాత్రం భారతదేశాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు.
ఒకసారి భారతదేశంలోని ఒక వ్యక్తి పరమహంసగారికి ఇలా వ్రాశారు: “ఖచ్చితంగా మీరు మీ భారతదేశాన్ని మరచిపోయారు. మీరు దాని నుండి చాలా దూరంగా ఉన్నందున, మీరు మీ మాతృభూమిని మరచిపోయి ఉంటారు.” కానీ మన గురుదేవులు తిరిగి ఇలా వ్రాశారు: “అలా ఎప్పటికీ జరుగదు. ఎందుకంటే నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టే, నేను ఈ భూమి మీద పగలు మరియు రాత్రి భారతదేశ సందేశాన్ని మరియు భగవంతుని పట్ల భారతదేశపు ప్రేమను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్నాను. ఏ రోజైనా ఒక్క క్షణం కూడా భారతదేశాన్ని నా హృదయం మరియు మనస్సులో వదలివేయలేదు.”
మన గురుదేవులు 1935లో ఒక సంవత్సరం పాటు ఉండడానికి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత భారతదేశానికి మళ్లీ రావాలని ఆయన ఎప్పుడూ ప్రణాళిక వేస్తూనే ఉన్నారు; కాని ఆయన ఎంతో తీరిక లేకుండా ఉన్నారు, మరియు ఆయన కార్యం ఎంతగానో పెరుగుతోంది, జగన్మాత ఆయనకి అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ ఆయన ఇలా జోస్యం చెప్పారు, “నేను భారతదేశ సందేశాన్ని ప్రపంచంలోని రెండో వైపుకు తీసుకువెళ్ళాను, మరియు భారతదేశం నన్ను తెలుసుకుంటుంది.”
ఆయన గురువైన శ్రీయుక్తేశ్వర్ గారు కూడా ఇలా అన్నారు, “నా సందేశం భారతదేశం నుండి భారతదేశంలో వ్యాపించదు; అది బయటి నుండి తిరిగి భారతదేశంలోకి వ్యాపిస్తుంది.”
పరమహంసగారు మరియు శ్రీయుక్తేశ్వర్ గారు ఇరువురూ ఇలా అన్నారు; మరియు పరమహంస యోగానందగారి గురించి బాబాజీ శ్రీయుక్తేశ్వర్ గారికి తెలియజేసినది కూడా ఇదే: “ప్రపంచమంతటికీ (యోగం యొక్క) సందేశాన్ని తీసుకెళ్ళడం కోసం శిక్షణ ఇవ్వడానికి నేను ఈ శిష్యుడిని మీ వద్దకు పంపిస్తున్నాను, ఎందుకంటే దేవుడు తన ప్రపంచం ఇప్పుడు ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. విభజనలు ఇకపై ఉండకూడదు.”
కాబట్టి తూర్పు మరియు పడమర నుండి ఈ ఐక్యత రావాలి; కాని ఇక్కడ భారతదేశంలోనే ఈ బోధన, ఈ కాంతి, మొట్టమొదట ప్రారంభమైంది మరియు ఆ తరువాత మొత్తం ప్రపంచానికి వ్యాపించింది. ఆ కారణంగానే మనము ఈ పవిత్ర భూమిని గౌరవిస్తాము.
స్నేహపూర్వక ఆకాశం,
ఆహ్వానించే మర్రి చెట్టు నీడ,
ప్రవహిస్తున్న పవిత్ర గంగ —
నిన్ను నేను ఎలా మరువగలను!
నిగనిగలాడుతూ కదలాడే భారతదేశ చేనులోని
పైరును నేను ప్రేమిస్తాను,
ఓహ్, దివ్యంగా ఎదిగిన మరణం లేని
దేవతల శక్తి కంటే అది మెరుగైనది!
దేవుని ఆజ్ఞతో విస్తృతమైన నా ఆత్మ ప్రేమ,
మొదట ఇక్కడే జనించింది,
నా స్వదేశంలో —
ప్రకాశమానమైన భారతదేశ భూమిలో.
నీ మలయమారుతాన్ని నేను ప్రేమిస్తాను,
నీ చంద్రుడిని నేను ప్రేమిస్తాను,
నీ పర్వతాలను మరియు సాగరాలను నేను ప్రేమిస్తాను;
నీలోనే నా జీవితం ముగియాలని ఆశిస్తున్నాను.
నాకు మొదట ఆకాశాన్ని, నక్షత్రాలను,
అన్నిటికన్నా మిన్నగా దేవుణ్ణి ప్రేమించడం నేర్పించావు,
కాబట్టి నా మొదటి నివాళి —
ఓ భారతదేశమా, నీ పాదాల వద్ద అర్పిస్తున్నాను!
అన్ని ప్రాంతాలను ఒకేలా చూడడం,
ఒకేలా ప్రేమించడం నీ నుండి ఇప్పుడు నేను నేర్చుకున్నాను.
నా స్వదేశమా, నా గొప్ప ప్రేమకు మాతృమూర్తి వైన నీకు
నేను ప్రణమిల్లుతున్నాను.
ఈ భూమిని దాని ఆధ్యాత్మిక ప్రాచీన సంస్కృతి కోసం గౌరవించండి, ఎందుకంటే అదే ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక కాంతి.
పూర్తి ప్రసంగాన్ని వినండి
పూర్తి ప్రసంగాన్ని చదవండి
1925లో పరమహంస యోగానందగారు స్థాపించిన పత్రిక యొక్క చరిత్ర, మరియు “యోగ సాధన ద్వారా దైవప్రమ మరియు ఆనందం పొందడం” వంటి ప్రసంగాలతో సహా, నమూనా కథనాలను మన యోగదా సత్సంగ పత్రిక పేజీలో మీరు మరింతగా తెలుసుకోవచ్చు.